10 April, 2026 | 9:18 PM

ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి

10-04-2026 07:16 PM

- కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన

- రూ. 1.52 కోట్లతో ప్యాక్స్ గోదాముల ప్రారంభం

- 191 మంది బాధితులకు రూ. 58.58 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఊరట

- అర్హులైన ప్రతి నిరుపేదకూ ఇందిరమ్మ ఇళ్లు

కూసుమంచి: రాష్ట్రంలో పేదల పక్షపాతిగా, ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని నడిపిస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కూసుమంచి మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు.

- అన్నదాతకు 'భూ భారతి' రక్షణ

చేగొమ్మ గ్రామంలో రూ. 1.52 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాములను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రూ. 20,670 కోట్ల మేర రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం. ఏడాదికి ఎకరానికి రూ. 12 వేలు అందిస్తూ, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంగా సర్వే మ్యాప్‌లతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా 3.80 లక్షల మందికి అందజేశాం.

వైద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదు

కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో 191 మంది బాధితులకు రూ. 58.58 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. వైద్యం కోసం పేదవాడు అప్పుల పాలు కాకూడదన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని, అందుకే గతంలో కంటే రెట్టింపు నిధులను వైద్యానికి వెచ్చిస్తున్నామని మంత్రి తెలిపారు.

అనంతరం వెంకటాపురంలో దేపంగి శ్రీకాంత్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, మునిసిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి పుల్లయ్య, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.