ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం
జానంపేట సర్పంచ్ పూనం ఉమా మహేశ్వరి ఆవేదన.
పినపాక,(విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమన్వయంతో పనిచేస్తున్న సర్పంచులపై కొందరు గుత్తేదారులు అసత్య ఆరోపణలు చేస్తూ గిరిజన సర్పంచులను మానసికంగా వేధించడం బాధాకరమని జానంపేట గ్రామ సర్పంచ్ పూనం ఉమా మహేశ్వరి అన్నారు. జానంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గ్రామపంచాయతీలో చేపడుతున్న ప్రతి పనిని గ్రామసభ తీర్మానాల ఆధారంగానే నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామసభలో ఆదాయ, వ్యయ వివరాలను కార్యదర్శి పూర్తిగా చదివి వినిపించిన తర్వాతే సభ్యుల సంతకాలు తీసుకుంటున్నామని చెప్పారు.పంచాయతీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులు పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా వివరాలు కోరితే చూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు అడిగినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే, గ్రామాభివృద్ధికి దోహదపడే పనులకే ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
అయితే కొంతమంది గుత్తేదారులు ఎంబీ (మెజర్మెంట్ బుక్)లు లేకుండా బిల్లులు పాస్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని, అలాంటి బిల్లులను ఏ విధంగా చెల్లించాలో జిల్లా కలెక్టర్ స్పష్టం చేయాలని కోరారు.ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు పత్రికల ద్వారా అసత్య ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఆమె, కావాలనే తమపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గిరిజన సర్పంచులు ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి వేధింపులు చేయడం తగదని పేర్కొన్న ఆమె, మీడియా ప్రతినిధుల పట్ల తమకు గౌరవం ఉందని, ఎప్పుడైనా వచ్చి పంచాయతీ రికార్డులను పరిశీలించవచ్చని తెలిపారు. ప్రజలకు, మీడియాకు అవసరమైన సమాచారాన్ని పారదర్శకంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కాజా హుస్సేన్, ఉప సర్పంచ్ రాజేష్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పేరం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు






