మరణానంతరం కూడా సేవలో...
శరీర దానానికి ముందుకొచ్చిన మంథని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటేష్
మంథని,(విజయక్రాంతి): మరణం తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో ఇద్దరు మానవతావాదులు తమ శరీరాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని అధ్యక్షులు మేడగోని వెంకటేష్ గౌడ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని, అలాగే సమాజ సేవలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో బోడకుంటి జ్యోతి తమ మరణానంతర శరీర దాన పత్రాలపై సంతకాలు చేశారు.
జన్మదిన వేడుకలకు కొత్త అర్థం
సాధారణంగా జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకు పరిమితం చేసే రోజుల్లో మేడగోని వెంకటేష్ గౌడ్ తన పుట్టినరోజున మరణానంతర శరీర దానానికి సిద్ధపడటం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. వీరిద్దరి నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. వైద్య విద్యకు, సమాజ హితానికి
ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు వెల్ది ఆనంతరాముల మాట్లాడుతూ.. మరణానంతరం మట్టిలో కలిసిపోయే దేహాన్ని వైద్య పరిశోధనల కోసం దానం చేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని, అవయవ దానం, శరీర దానం పట్ల ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సదాశయ ఫౌండేషన్ పెద్దపల్లి మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత మాట్లాడుతూ... మహిళలు కూడా ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.
అభినందించిన ప్రముఖులు
ఈ చైతన్యవంతమైన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమాన్ పూర్ అధ్యక్షులు సాన రామకృష్ణ రెడ్డి లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూదరి దత్తాగౌడ్ లయన్స్ క్లబ్ విజన్ కేర్ అధ్యక్షులు బుద్దార్తి సతీష్ కుమార్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడగోని రాజమౌళి గౌడ్ కార్యదర్శి నల్లవల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరీర దాతలైన వెంకటేష్ గౌడ్ మరియు జ్యోతిలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.






