కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం
- డాక్టర్స్ డే వేడుకలో మందమర్రి జీ .ఏం రాధాకృష్ణ
మందమర్రి,(విజయ క్రాంతి): వైద్య శాస్త్రానికి కృత్రిమ మేధ తోడవడంతో మానవారోగ్య రంగం లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, వస్తున్నాయని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అన్నారు. బుధవారం డాక్టర్స్ డే పురస్కరించుకుని కేకే 1 డిస్పెన్సరీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్య శాస్త్రం శాఖోప శాఖలుగా విస్తరిస్తోందని, గతంలో లొంగని రోగాలు సైతం లొంగివస్తున్నాయన్నారు. ఏ.ఐ.ఎంత విశ్లేషించినా చివరకు డాక్టర్ ను సంప్రదించమనే చెప్తుందని,అదే సమాజంలో డాక్టర్ కు ఉన్న ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
సింగరేణిలో ఆబ్సెంటిజం చేసే కార్మికులను డాక్టర్లు కౌన్సిలింగ్ చేసి రెగ్యులర్ గా విధులు నిర్వహించేలా ప్రయత్నించాలన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆసుపత్రి సిబ్బంది ఓపికతో కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఐ ఈ డి ఇంజనీర్ కిరణ్ అన్నారు. సమాజంలో డాక్టర్ల సేవలు మరువలేనివని గుర్తింపు కార్మిక సంఘం కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ ప్రశంసించారు. అందుకే వైద్యుడే నారాయణుడు అనే నానుడి ఉందన్నారు.
- ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేత
ఈ సందర్భంగా సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని డాక్టర్ పాక శ్రీజ కు జీఎం రాధాకృష్ణ అందజేశారు. అదే విధంగా కేకే డిస్పెన్సరీలో స్టాఫ్ నర్స్(కాంట్రాక్టు)గా పనిచేసిన నక్క సుష్మ ములుగు ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా సెలెక్ట్ అయింది. ఈ సందర్భంగా ఆమెను జీ.ఎం.,అతిథులతో పాటు ఆసుపత్రి సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలోమెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్ రావు, మెడికల్ అధికారి డాక్టర్ హుస్సేన్ ఖాన్ అర్ఫాత్,డిస్పెన్సరీ సిబ్బంది పాల్గొన్నారు.






