ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
ముకరంపుర,(విజయక్రాంతి): లాభాల బాటలో నడిచే ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం సిగ్గుచేటని వెంటనే ఈ ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ నష్టపోతుందనే ఉద్దేశముతో ఆర్టీసీలో కార్గోను ప్రవేశపెట్టిందని దీని ద్వారా ఎన్నో లాభాలు వచ్చాయని కానీ నేడు అదే కార్గో అప్పుల్లో ఉందనే సాకుతో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని కుట్రకు పూనుకోవడం సిగ్గుచేటని అన్నారు.
ప్రస్తుతం కార్గో ద్వారా ఏటా వంద నుంచి 120 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం వస్తుందని, గతంలో జరిగినటువంటి టెండర్లలో 35 కోట్లకు ఒక ప్రైవేటు సంస్థకు టెండర్ అప్పగించగా కొత్త అగ్రిమెంట్ ఆగస్టు ఒకటి నుంచి అమలయ్యే అవకాశం ఉందని దీంతో కార్గో పై ఆధారపడ్డ దాదాపు 500 మందికి పైగా హమాలీల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే కార్గో ప్రైవేటీకరణను నిలిపివేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.






