ఇసుక తోడేందుకు వెళ్లి... వాగులో శవమై
నర్సాపూర్ వాగులో గుంతలో చిక్కుకొని వ్యక్తి మృతి...
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ వాగులో ఇంద్రవెల్లి మండలానికి చెందిన ముండే విట్టల్ (38) వాగులోని గుంతలో చిక్కుకొని మృతి చెందాడు. మృతుడి బంధువులతో పాటు ఉట్నూర్ ఎస్సై గుమ్మల విజయ్ తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన గణేష్ తన ట్రాక్టర్ తో ఆదివారం సాయంకాలం వాగులో ఇసుకను తోడేందుకు ఇద్దరు కూలీలతో జైత్రం తండా సమీపంలోని నర్సాపూర్ వాగులో ఇసుక తోడుతున్నారు.
ఈ క్రమంలో ముండే విట్టల్ వాగులోని నీటిలో ఇసుకను తోడేందుకు వాగులోకి వెళ్లారు. వాగులో ఉన్న గుంతను గమనించక గుంతలో పడిపోయారు. ఈత రాణి విట్టల్ గుంతలో పడిపోయారని అన్నారు. గుంతలో పడిపోయాను రక్షించండి అంటూ చేతులు పైకెత్తి లేపి చూపిన ఆయన వెంట వెళ్లిన ఇద్దరూ ఆయనను రక్షించలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇసుక కోసం వెళ్లిన మృతుడి తో పాటు మరో ఇద్దరికి ఈత రాదని జైత్రంతాండవాసులు తెలిపారు. వాగులో మునిగిపోయిన ముండే విట్టల్ శవం కోసం ఉట్నూర్ ఎస్సై విజయ్ ఈత వచ్చే వారిని పిలిపించి గుంతలో నుంచి సోమును బయటకు తీయించారు. ప్రమాదవశత్తు గుంతలో పడిపోయినట్లు మృతుడి అన్న బాబు ముండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






