క్షణికావేశం.. తీసింది ప్రాణం
పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట: క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నర్సింగరావుపల్లి తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. నర్సింగరావుపల్లి తండాకు చెందిన కేతావత్ తౌర్య(32) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా తరచూ తల్లి, భార్యతో గొడవ పడుతూ.. ఖర్చులకు సైతం డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు.
అదే విధంగా ఈనెల 22న రాత్రి డబ్బుల విషయంలో తల్లి, భార్యతో గొడవ పడ్డాడు. మరుసటి రోజు ఉదయం తల్లి హేమ్లీ తన కూతురు దగ్గరకు వెళ్లగా, భార్య సునీత కూలీ పనులకు వెళ్ళింది. అనంతరం క్షణికావేశంలో తౌర్య పాపన్నపేట గ్రామ శివారులో ఉన్న సర్దార్ చెరువు కట్టపై గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి హేమ్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.






