24 August, 2026 | 11:03 PM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ

24-08-2026 09:22 PM

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రూ.14 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామపాలన అధికారి(జీపీఓ) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ వివరాల ప్రకారం.. ఆలేరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్ రావు (AO-1), కొలనుపాక గ్రామ జీపీఓ షేక్ అహ్మద్ (AO-2) కలిసి భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నివేదికను తహసీల్దార్‌కు పంపేందుకు రూ.14 వేల లంచం డిమాండ్ చేశారు.

ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగ మహేష్ తండ్రి నుంచి సంక్రమించిన భూమిని పౌతీ చేసేందుకు రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. రూ. 14 వేలు ఇవ్వాలని చెప్పడంతో మహేష్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం (ఆగస్టు 24) ఏసీబీ నల్గొండ రేంజ్ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో జీపీఓ షేక్ అహ్మద్ వద్ద నుంచి రూ.14 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల కోసం ఏర్పాటు చేసిన ఐ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.