అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న
ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ ఆందోళన
ఇల్లందు, మే 4 (విజయక్రాంతి): అకాల వర్షాల కారణంగా కొమరారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన పంట తడిసి నష్టపోయిన పరిస్థితిలో లారీలు పంపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్ మాట్లాడుతూ మార్క్ఫెడ్ కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చిన మొక్కజొన్నను సకాలంలో తరలించకపోవడంతో పంట తడిసి రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే లారీలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని తరలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన పంటను ఆలస్యం చేయడంతో రైతులు మధ్య దళారులవైపు మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడుతోందని, ఇది రైతులకు అన్యాయం అని పేర్కొన్నారు. కొమరారం మార్కెట్ యార్డ్ వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.






