ముసురు వర్షంలో మధ్యాహ్న భోజనం
బేస్మెట్ లెవెల్ లో నిలిచిపోయిన భోజనశాల
ఉట్నూర్, జూలై 22 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోనే వెయ్యి మంది విద్యార్థులు విద్యను అభ్యసించే పాఠశాలలో అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి. ఈ పాఠశాలలో మండలంలోని వివిధ గ్రామాల విద్యార్థులతో పాటు ఉట్నూర్, గుడిహత్నూర్, నార్నూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పేద విద్యార్థులు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో 1030 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సమయంలో నానా అస్తువులు పడుతున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజర్శి షా ప్రత్యేక కృషితో 22 లక్షల రూపాయలతో భోజనశాల నిర్మించుటకు నిధులు మంజూరు చేశారు. మంజూరైన నిధులతో పనులు తీసుకున్న కాంట్రాక్టర్ బేస్మెంట్ లెవెల్ వరకు పనులు పూర్తిచేసి మిగతా మిగతా పనులు వదిలేశారు. దీంతో భోజనశాల పూర్తి కాకపోవడంతో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బుధవారం రోజున ముసురు వర్షం కురుస్తుండగా తరగతుల వారిగా విద్యార్థులను మధ్యాహ్న భోజనానికి ఉపాధ్యాయులు వదిలేశారు. ముసురు వర్షంలో విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని ముసురు వర్షంలో బారువులు తీసి మధ్యాహ్న భోజనం చినుకులలో తినవలసి వచ్చింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా భోజనశాలను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.






