కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం
తొలి బ్యాచ్లోనే 72 శాతం ఉత్తీర్ణత
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. 2024లో నూతనంగా ప్రారంభమైన ఈ కళాశాల, తన మొదటి బ్యాచ్లోనే 72 శాతం ఉత్తీర్ణత సాధించి విద్యా వర్గాల్లో ప్రభంజనాన్ని సృష్టించింది.
మెరిసిన ఆణిముత్యాలు:
ద్వితీయ సంవత్సరం (Second Year) ఫలితాల్లో ఎం.పి.సి (MPC) విభాగంలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఎస్.కె. సీజ్జా ఫాల్కా 977 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచారు. పిట్టల భార్గవి: 907 మార్కులతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కూడా విద్యార్థులు సత్తా చాటారు
జంగ లిఖిత్ రెడ్డి: 463 మార్కులతో ప్రథమ స్థానం, ఎమ్.డి. సుహానా: 440 మార్కులతో ద్వితీయ స్థానం, అంతేకాకుండా, ఎం. శివాని, ఎన్. సుమంత్, ఆతునూరి యామిని లు 400 పైచిలుకు మార్కులు సాధించి కళాశాల కీర్తిని దశదిశలా చాటారు.
మంత్రివర్యులకు కృతజ్ఞతలు:
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో, కూసుమంచిలో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన గౌరవనీయ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అధ్యాపక బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన దూరదృష్టి వల్ల నేడు గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ స్థాయి ఫలితాలను సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్అధ్యాపక బృందం అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.




