11 August, 2026 | 3:05 AM

‘కింగ్‌మేకర్’.. సోషల్ మీడియా!

11-08-2026 12:00 AM
  1. ఫోన్ స్క్రీన్‌పై మొదలై.. బ్యాలెట్ బాక్స్ దాకా
  2. ఒక్కో వేదికకు ఒక్కో వ్యూహం
  3. 2014లో సోషల్ మీడియా ఎంట్రీతో కీలక మలుపు
  4. 2024లో యూట్యూబ్ వైపు, 2026లో ఇన్‌స్ట్రాగామ్ 
  5. మారుతున్న ఎన్నికల ప్రచార స్వరూపం
  6. బీజేపీ ముందు కొత్త డిజిటల్ పరీక్ష    
  7. పాత వేదికలపై పట్టు, సవాల్‌గా కొత్త ప్లాట్‌ఫామ్‌లు

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): గడిచిన దశాబ్దంలో భారత రాజకీయ వ్యవస్థలో మౌలికమైన మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు ప్రజలను చేరుకునేందుకు ప్రయోగాత్మక సాధనంగా భావించిన సోషల్ మీడియా.. ఇప్పుడు ఎన్నికలను ప్రభావితం చేసే, రాజకీయ కథనాలను నిర్దేశించే, అధికారం దక్కించుకునే పోరాటాలకు వేదికగా మారింది. సోషల్ మీడియా ఇకపై వినోదం, సాధారణ ప్రజాసంబంధాల కోసం ఉపయోగించే ఒక అదనపు మాధ్యమం మాత్రమే కాదు..

రాజకీయాల్లో ఎవరి స్వరం ఎంత దూరం వినిపించాలి, ఎవరు ప్రజల దృష్టిని ఆకర్షించాలి, ఎవరు ప్రజలను సమీకరించాలి అన్న విషయాలను ప్రభావితం చేసే కొత్త యుద్ధభూమిగా అది మారింది. చివరికి. ఎన్నికల ఫలితాలపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో సోషల్ మీడియా ఎంట్రీతో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలను భారతదేశపు తొలి ‘సోషల్ మీడియా ఎన్నిక’గా పరిగణిస్తారు.

డిజిటల్ మీడియా వేదికల సామర్థ్యాన్ని బీజేపీ తొలినాళ్లలోనే గుర్తించి, దానిని వ్యూహాత్మకంగా వినియోగించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వేదికలపై పార్టీ అత్యంత వ్యవస్థీకృతమైన, కంటెంట్ ఆధారిత ప్రచారాన్ని నిర్మించి.. అభివృద్ధి, జాతీయవాదం, మార్పు వంటి అంశాల చుట్టూ ఒకే విధమైన రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో.. దేశం అప్పటివరకు చూడని విధంగా బూత్ స్థాయిలోవిస్తృతమైన వాట్సాప్ నెట్‌వర్క్‌ను నిర్మించింది.

స్థానిక పార్టీ విభాగాలు.. నిర్దేశించిన సందేశాలను పంపించడం, ప్రతిపక్ష ఆరోపణలకు తక్షణమే సమాధానాలు ఇవ్వడం, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల సమన్వయం చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించాయి. బహిరంగ వేదికలపై విస్తృత ప్రజా సందేశాలను ప్రచారం చేయడం, వాట్సాప్ వంటి గ్రూపుల ద్వారా కచ్చితమైన స్థాయిలో సమాచారాన్ని చేరవేయడంతో బీజేపీకి సంప్రదాయ రాజకీయ వ్యవస్థలతో పోలిస్తే స్పష్టమైన సంస్థాగత ఆధిక్యాన్ని అందించింది. ఫలితం ఘనమైన ప్రజా తీర్పు. డిజిటల్ మౌలిక వసతులను సమర్థంగా వినియోగిస్తే అవి ఓట్లుగా మారగలవన్న విషయాన్ని 2014 ఎన్నికలు స్పష్టంగా నిరూపించాయి.

2024లో మరో మలుపు

దశాబ్దం తర్వాత పరిస్థితిలో మరో మార్పు వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలు యూట్యూబ్‌ను ప్రధాన రాజకీయ వేదికగా నిలబెట్టాయి. ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించినప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేక స్వరాలకు, కాంగ్రెస్‌కు యూట్యూబ్‌లో విస్తృతమైన అవకాశాలు లభించాయి. దీర్ఘకాలిక వీడియోలు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాన ఛానళ్లు, విమర్శనాత్మక డాక్యుమెంటరీలు విస్తృతంగా వెలువడ్డాయి.

లోతైన రాజకీయ కథనాలను నిర్మించేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం, స్థానిక సమస్యలను ప్రధాన రాజకీయ చర్చలోకి తీసుకురావడం, యువతతో పాటు తొలిసారి ఓటు వేయబోయే వారిని ఆకర్షించడం వంటి లక్ష్యాలతో ప్రతిపక్ష అనుకూల కంటెంట్ సృష్టికర్తలు, రాజకీయ పార్టీలకు అనుబంధ ఛానళ్లు యూట్యూబ్‌ను విస్తృతంగా వినియోగించాయి. 

బీజేపీ ముందున్న కొత్త సవాళ్లు

వరుస పరిణామాలు బీజేపీకి సవాళ్లను విసురుతున్నాయి. ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఆ పార్టీ ఇప్పటికే గణనీయమైన ఆధిపత్య్ంన ప్రదర్శించింది. ఆ వేదికలపై దాని సంస్థాగత సామర్థ్యం, కంటెంట్ సృష్టి వ్యవస్థలు, కార్యకర్తల నెట్వర్క్‌లు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే స్థాయి ప్రభావాన్ని ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌లలో సాధించడం ఇప్పుడు బీజేపీ ముందున్న పరీక్ష. ఇన్‌స్టాగ్రాం అందం, ఏకరూపమైన దృశ్య శైలి, ప్రజలకు దగ్గరగా అనిపించే కంటెంట్, అల్గారిథంకు అనుగుణంగా వేగంగా మారగల సామర్థ్యాన్ని కోరుతుంది.

యూట్యూబ్ మాత్రం దీర్ఘకాలిక కథన నిర్మాణం, నాణ్యమైన నిర్మాణ విలువలు, ప్రేక్షకులను ఎక్కువసేపు వీడియోలో నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఈ రెండు వేదికలూ కేవలం చెల్లింపు ప్రకటనలపై ఆధారపడకుండా సహజమైన ప్రజాదరణను, నేరుగా సామాన్య ప్రజలను చేరుకునేలా కంటెంట్ సృష్టికర్తలు, రాజకీయ సంస్థలకు ఎక్కువ అవకాశాలను ఇస్తున్నాయి. ఈ మార్పుకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైతే.. ఇప్పటికే ఈ వేదికలపై పట్టు సాధిస్తున్న ప్రత్యర్థులు.. రాజకీయంగా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంది.

ప్రతి వేదికకూ ప్రత్యేకమైన వ్యూహం

రాజకీయ పార్టీలు ఒకేసారి అనేక రకాల ప్రచారాలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్స్, ఫేస్‌బుక్‌లను బహిరంగ ప్రజా వేదికగా, వాట్సాప్‌లో వ్యక్తిగత, గ్రూప్, ఇన్‌స్టాగ్రామ్‌లో దృశ్యపరమైన, వ్యక్తులు కేంద్రంగా, యూట్యూబ్‌లో దీర్ఘకాలిక రాజకీయ ఒప్పింపునకు మరో రకమైన కంటెంట్.. ఇలా ప్రతి వేదికకు ప్రత్యేకమైన వ్యూహం అవసరమవుతోంది. దీంతో వనరుల కేటాయింపు, కంటెంట్ వ్యూహం, ప్రతిభావంతుల నియామకం వంటి అంశాలూ పూర్తిగా మారిపోయాయి. రాజకీయ కమ్యూనికేషన్ బృందాలు క్రమంగా మీడియా నిర్మాణ సంస్థలను తలపిస్తున్నాయి. డేటా విశ్లేషణ, సందేశాలపై ఏ/బీ పరీక్షలు, ప్రత్యర్థుల ప్రచారానికి తక్షణ ప్రతిస్పందన ఇచ్చే బృందాలు ఇప్పుడు రాజకీయ ప్రచారంలో సాధారణంగా కనపడుతున్నాయి. 

రెండు వైపులా సామర్థ్యం

సోషల్ మీడియా రాజకీయాల కొత్త ‘కింగ్‌మేకర్’గా మారింది. దానికి రెండు వైపులా పదునైన సామర్థ్యం ఉంది. ఒకరిని విపరీతంగా వెలుగులోకి తీసుకురాగలదు.. అదే సమయంలో మరొకరిని ప్రజల దృష్టికి దూరం చేయగలదుకూడా. సరైన సమయంలో సరైన వేదికపై కనిపించడమనేది..

ఒక అభ్యర్థి లేదా పార్టీకి వాస్తవ సంస్థాగత బలానికి మించిన రాజకీయ ప్రభావాన్ని అందించగలదు. అదే సమయంలో ఒక ఎన్నికల చక్రంలో కీలకంగా మారిన వేదికపై ఒక పార్టీ కనిపించకపోతే, భారీ వనరులు ఉన్నప్పటికీ కీలకమైన ఓటరు వర్గాల్లో అది పాక్షికంగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. 2014, 2024, 2026 ఎన్నికలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ప్రతి ఎన్నికల చక్రం ఒక ప్రధాన డిజిటల్ వేదికను రాజకీయ పోరాటానికి కేంద్రంగా నిలబెడుతోంది. దీని ప్రాధాన్యం రాబోయే రోజుల్లో పెరగుతుంది. 

తమిళనాడులో ఇన్‌స్టాగ్రామ్ రాజకీయాలు

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రచారం కోసం ఇన్‌స్టాగ్రాంను ప్రధాన వేదికగా వినియోగించింది. చిన్నగా ఉండే (షార్ట్‌ఫార్మ్) వీడియోలు, రీల్స్, స్టోరీలు, దృశ్యపరంగా ఆకర్షణీయమైన కంటెంట్ ద్వారా ప్రజలను చేరుకునే ప్రయత్నం చేసింది. సినీ తెరపై ఇప్పటికే భారీ ప్రజాదరణ కలిగిన టీవీకే అధినేత విజయ్‌కు..

ఇన్‌స్టాగ్రాం అనుకూలంగా మారింది. సంప్రదాయ మీడియా ఫిల్టర్లను, పార్టీ అంతర్గత వ్యవస్థలపై ఆధారపడే ప్రచార పద్ధతులను పక్కనపెట్టి యువతతో నేరుగా సంభాషించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఎన్నికలను భారతదేశపు తొలి ‘ఇన్‌స్టాగ్రాం ఎన్నిక’గా కూడా పరిగణించే అవకాశం ఉంది. దశాబ్దాలుగా స్థిరపడిన ద్రవిడ రాజకీయ శక్తులు, సంప్రదాయ ప్రచార పద్ధతులకు పేరుగాంచిన తమిళనాడులో మొబైల్ కేంద్రంగా.. దృశ్య ఆధారిత రాజకీయ ప్రచారం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.