1 May, 2026 | 8:05 PM

కార్మికుల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలు

01-05-2026 07:11 PM

కార్మికుల కృషితోనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యం

నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ

మేడే వేడుకల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల,(విజయక్రాంతి): సంఘటిత, అసంఘటిత కార్మికుల కృషితోనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందని, వారీ సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి కార్మికులు ఎంతో బాధ్యతతో పని చేస్తుంటారని, వారి హక్కులను కాపాడేందుకు, సేవలకు గుర్తుగా ప్రతి ఏటా మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే లేబర్ కార్డులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, రెన్యువల్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం నుంచి అందే పథకాలకు అర్హత కోల్పోవాల్సి వస్తుందన్నారు. పని ప్రదేశంలో మహిళలపై వివక్ష, లైంగిక వేధింపుల నివారణకు ఉద్దేశించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఐటిఐ, ఏటిసి  విద్యార్థులకు సాంకేతికాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలంపూర్ నియోజకవర్గంలో కూడా త్వరలో ఏటీసీ కేంద్రం ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో తరచు జాబ్ మేళాలు నిర్వహిస్తుండడంతో నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత తమకు ఉద్యోగాలు ఎక్కడ వచ్చిన చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పలు అంతర్జాతీయ వెబ్సైట్లో ఉద్యోగాలకై రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయా విదేశీ భాషలు నేర్చుకొని, మంచి వేతనాలతో అక్కడ ఉద్యోగాలు పొందవచ్చన్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతలో నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్స్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి తీసుకునే వివిధ రుణాలను సొంత అవసరాలకు ఖర్చు పెడితే లాభం లేదని ఏవైనా వృత్తులు, వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన బుక్లెట్లను కలెక్టర్ పలువురు జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన  ఉద్యోగులకు, పరిశ్రమల యాజమాన్యాలకు అవార్డులు అందజేశారు. పలువురు కార్మికులను సన్మానించారు.