ఓబీసీల లెక్కలు తేల్చకుంటే కేంద్రంతో యుద్ధమే
- బీజేపీకి ఏం పాపం చేశారు
- నేడు రౌండ్ టేబుల్ సమావేశం
- పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జన గణనలో ఓబీసీల కుల గణన అంశాన్ని ఎందుకు చేర్చలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు నిలదీశారు. జన గణనలో కుల గణన చేయకపోతే కేంద్ర ప్రభుత్వంపై ఓబీసీల యుద్దం తప్పదని వీహెచ్ హెచ్చరించారు.
శుక్రవారం ఆయన అంబర్పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జన గణన అంశానికి సంబంధించి జారీ చేసిన నిబంధనల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ కులాల వివరాలు మాత్రమే తీసుకుంటారని, ఓబీసీల అంశాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. బీసీ కులగణన ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ జరగదని, అందుకు బీసీ ప్రజలను ఏకం చేసేందుకు కార్యాచరణను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వివిధ పార్టీలు, బీసీ సంఘాలు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇతర ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వీహెచ్ పేర్కొన్నారు. మోదీ రిమోట్ అంతా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ చేతిలో ఉందన్నారు. డిజిటల్ సెన్సెస్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది ఉంటుందన్నారు.
జన గణన ఫార్మెట్లోని అంశాలు విచిత్రంగా ఉన్నాయన్నారు. ఇల్లు కూలిపోతుందా, స్లాబ్కి ఏమి వాడారు? రేడియో ఉందా? అంటూ సిల్లి వివరాలను పెట్టారని విమర్శించారు. జనాల వివరాలు సేకరించే లిస్ట్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీల వివరాలు కూడా సేకరించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. హిందువుల ఓట్లతో గెలవాలని బీజేపీ చూస్తోందన్నారు.




