05-02-2026 12:44:21 AM
కమ్యూనిటీ హాల్ స్థలం కబ్జా
శ్రీ వెంకటేశ్వర కాలనీలో భవనం సీజ్
మణికొండ,ఫిబ్రవరి 4 ( విజయక్రాంతి) : శ్రీ వెంకటేశ్వర కాలనీలో యథేచ్ఛగా సాగిన భూకబ్జా బాగోతం బట్టబయలైంది. ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను మింగేసిన అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రా లు సృష్టించి, అధికారులను బురిడీ కొట్టించి కమ్యూనిటీ హాల్, సెప్టిక్ ట్యాంక్ స్థలాల్లో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
1996 నాటి టెంటేటివ్ లేఅవుట్నే ఆమోదిత లేఅవుట్గా చూపిస్తూ కబ్జాదారులు తమ మాయాజాలాన్ని ప్రదర్శించారు. లేఅవుట్లోని ప్లాట్ల వివరాలను అడ్డం పెట్టుకుని ఖాళీ స్థలాలను ఆక్రమించారు. సెప్టిక్ ట్యాంక్ కోసం కేటాయించిన స్థలానికి సైతం అక్రమంగా ఇంటి నంబర్ కేటాయించుకుని, ఆపై హెచ్ఎమ్డీఏ నుంచి అనుమతులు పొం దడం గమనార్హం. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ మోసం బయటపడింది.
వారు సమర్పించిన ఎల్ఆర్ఎస్ నకిలీదని హెచ్ఎమ్డీఏ నిర్ధారించడంతో హైడ్రా అధికారులు చర్యలకు దిగారు.కాలనీలోని ఓపెన్ స్పేస్, కమ్యూనిటీ హాల్ స్థలాల పరిరక్షణ కోరుతూ కాలనీ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేసిన హైడ్రా, అక్రమంగా నిర్మించిన భారీ భవనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది.