21 May, 2026 | 4:10 AM

అక్రమంగా మట్టిని పోసి, వాగును కప్పివేస్తున్నారనే ఫిర్యాదుపై రంగంలోకి దిగిన హైడ్రా

21-05-2026 01:41 AM

ఘట్‌కేసర్, మే 20 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్ లో సర్వే నంబర్లు 153, 154 లో గల ఎరుమల్లె వాగులో అక్రమంగా మట్టిని పోసి, వాగును కప్పివేస్తున్నారనే అంశంపై స్థానికుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా బృందం రంగంలోకి దిగింది. బుధవారం హైడ్రా సీఐ రాజశేఖర్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, పరిశీలించారు.

ఎరుమల్లె వాగు పరివాహక ప్రాంతం బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్లు 153, 154 లలో భారీగా మట్టిని పోసి, సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాగులో మట్టిని పోస్తున్న పనులను హైడ్రా అధికారులు తక్షణమే నిలిపివేయించారు.

నిబంధనలను ఉల్లంఘించి సహజ వనరులను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. సదరు సర్వే నంబర్ల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించడానికి రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను, మ్యాపులను పరిశీలిస్తున్నారు. పూర్తి నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్ పాల్గొన్నారు.