భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య
- కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- మృతుడు వరంగల్లో డాక్యుమెంటరీ రైటర్
హనుమకొండ (మహబూబాబాద్), జూలై 6(విజయక్రాంతి): రైలు కిందపడి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్యకు వీడియో కాల్ చేసి భర్త చనిపోయిన ఘటన కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వరంగల్ నగరంలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్న రాజేష్ నాయక్ (45) రైలు పట్టాలపై నిలబడి తన భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపంతో కాజిపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో రాజేష్ నాయక్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీడియో కాల్ చేసినప్పటికీ కేవలం తమను బెదిరించడానికి చేస్తున్నాడని భావించారని, చనిపోతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.






