కుంట్లూరులో ఉద్రిక్తత..
హైడ్రా కూల్చివేతలపై హైడ్రామా..
అధికారులను అడ్డుకున్న కాలనీవాసులు
పక్క భూ యజమాని అగర్వాల్ ఫిర్యాదుతో రంగంలో దిగిన హైడ్రా
అబ్దుల్లాపూర్ మెట్ ఏప్రిల్ 29: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్- 52 డివిజన్ పరిధి కుంట్లూరు ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు కబ్జా చేశారంటూ పక్క భూ యాజమాని అగర్వాల్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. హై కోర్ట్ ఆదేశాలు, హైడ్రాధికారులు పూర్తిస్థాయిలో విచారణ తర్వాతనే హైడ్రా ఇన్ స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో హయత్ నగర్ పోలీస్ బందోబస్తు మధ్య బుధవారం ఉదయం అధికారులు ఆక్రమణలు కూల్చివేసేందుకు వచ్చారు.
అయితే గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు లోనికి రానివ్వకుండా గేటు వద్దే హైడ్రా అధికారులను, పోలీస్ అధికారులను అడ్డుకున్నారు. ఎలాగైనా కూల్చివేతలు చేపడతామంటూ హైడ్రా అధికారులు భీష్మించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. సుమారు రెండు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. భారీగా పోలీసులు మోహరించి, హైడ్రా సిబ్బందితో కలిసి చివరకు అజయ్ గుల్మహార్ ప్రహరీని తొలగించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్, ఎస్త్స్రలు వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.






