తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు(Southwest Monsoons) గురువారం నాటికి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకే అవకాశం ఉన్నందున బుధ గురువారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు(Heavy Rainfall) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ములుగు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలా ఉండగా, మంగళవారం పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లాలోని ఎన్కూరు మండలంలోనే అత్యధికంగా 7.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో 4 సెం.మీ, ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో 1.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా, మంగళవారం తెలంగాణలోని 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40.2 నుండి 44.7 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.






