కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూములపై రేవంత్ కన్ను— అమ్మేసే కుట్ర
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొహెడలో ఫ్రూట్ మార్కెట్(Koheda Fruit Market) స్థలాన్ని మాజీ మంత్రులు హరీశ్ రావు(Former Minister Harish Rao), సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వాలు రైతుల కోసమే పనిచేయాలని.. దళారుల కోసం కాదని హరీశ్ రావు సూచించారు. గతంలో మార్కెట్ కు భూసేకరణలో భాగంగా రూ. 10 కోట్లు రైతులకు ఇప్పించారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.
రూ. వెయ్యి కోట్లతో డీపీఆర్ తయారు చేశామని చెప్పారు. 100 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కు రూపకల్పన చేశామన్నారు. పండ్ల భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి కన్ను(CM Revanth Reddy) పడిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎక్కడ భూములున్నా వాటిని అమ్మేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను రేవంత్ దళారులకు కట్టబెట్టి లక్షలాది మంది రైతుల పొట్ట కొడుతున్నాడని మండిపడ్డారు. 'నీకు రైతుల ప్రయోజనాల కంటే దళారులే ముఖ్యమా' రేవంత్? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, భూముల చుట్టూ రేవంత్ తిరుగుతున్నడు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకొని ఎక్కడో గుట్టల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) ఆరోపించారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించారు. రూ. 10 వేల కోట్ల రూపాయలు దండుకునేందుకు కాంగ్రెస్ నాయకులు నాదర్ గుల్, కోహెడ భూములపై గద్దల్లా వాలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లు పాటు ఈ కోహెడ మార్కెట్ స్థలాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ కోహెడ మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.




