27 April, 2026 | 2:44 AM

అక్రమాలకు ఇక చెక్

27-04-2026 01:06 AM

ధాన్యం కొనుగోళ్లలో సర్కారు కీలక సంస్కరణలు

లారీ లోడ్ చేసిన వెంటనే ట్రక్ షీట్ జెనరేట్

కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు జరుగుతున్న అవినీతి ఆక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలు చేయిస్తుంది. ఇకపై ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ కానుంది. గతంలో మాన్యువల్ గా ట్రక్ షీట్ వారికి అనుకూలంగా ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం నిలువలను పంపి కుంభకోణాలు జరగడంతో, అలాంటి అవకాశాలు కలవకుండా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో ట్రక్ షీట్ ధాన్యం లారీలోడు కాగానే జనరేట్ అయ్యే విధంగా ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తేచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా అమలు 

ధాన్యం కొనుగోలు లో జరుగుతున్న అవినీతి, ఆక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరదర్శికంగా క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్లైన్లో రక్షిత్ జనరేట్ చేసి సంబంధిత మిల్లును ఆటోమేటిక్గా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది. మాన్యువల్ మిల్లుల కేటాయింపు విధానానికి ఇక స్వస్తి పలికింది. కొత్త విధానంలో లారీలో ధాన్యంలో ముందుగా మిల్లు వివరాలు తెలియవు. రక్షిత్ ఆన్లైన్లో జనరేట్ చేసిన తర్వాతే సిస్టం ఆటోమేటిక్గా ఏ మిల్లు కు  తరలించాలో సూచిస్తుంది.

అక్రమాలకు ఇక చెక్ 

కొనుగోలు కేంద్రంలో ధాన్యం లారీల్లో నింపిన వెంటనే ట్రక్ షీట్ ఆన్లైన్లో జనరేట్ చేసిన తర్వాతే సిస్టం ఆటోమేటిక్గా ధాన్యాన్ని  ఏ మీల్లుకు తరలించా లో సూచిస్తుంది. ట్రక్ షీట్లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తప్పనిసరిగా తరలించాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీని పరిగణలోకి తీసుకుని కేటాయింపులు జరపనున్నారు. దీంతో ఇప్పటివరకు మిల్లర్ లు కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు చేస్తున్నా అక్రమాలకు చెక్ పడనుంది.

జిపిఎస్ విధానంతో పర్యవేక్షణ 

ధాన్యం రవాణాలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని తప్పనిసరి చేశారు. లారీలు డీసీఎం వాహనాల్లో జిపిఎస్ పరికరాలు అమర్చడం తప్పనిసరిగా చేశారు. జిపిఎస్ పని చేస్తున్న వాహనాలకు  మాత్రమే లోడింగ్ అనుమతి ఇస్తారు. వాహనాల కదలికలను రియల్ టైంలో పర్యవేక్షించి ధాన్యం ఎక్కడికి వెళుతుంది అన్న దానిపై స్పష్టత ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 

పారదర్శకత్వం రైతులకు లాభం 

సివిల్ సప్లై శాఖ తీసుకొచ్చిన ఈ సంస్కరణలతో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పెరిగి, రైతులకు న్యాయమైన ధర లభించడంతోపాటు చెల్లింపులు వేగవంతమవు తాయని జిల్లా పౌరసరపరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు. సాంకేతిక ఆధారంగా రూపొందించిన ఈ విధానం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు వస్తున్నట్లు తెలిపారు.

వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై జిల్లా అధికారి, కామారెడ్డి