2 July, 2026 | 3:29 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

గీతం విద్యార్థులకు పిలుపు

02-07-2026 02:36 PM

జాతీయ స్థాయి పోటీలలో మరోసారి సత్తాచాటాలని సూచన

పటాన్ చెరు జులై 2: భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ఆవిష్కరణల కార్యక్రమమైన ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 6.0లో చురుకుగా పాల్గొనాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన విద్యార్థులు, అధ్యాపకులను కోరింది. అధ్యాపకులను ఉద్దేశించి గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ స్కీమ్ సమన్వయకర్త వికాస్ కుమార్ శ్రీవాస్తవ సూచనలు చేస్తూ, జాతీయ స్థాయి హ్యాకథాన్ కు సమర్పించేందుకు వీలుగా, విద్యార్థుల ఆశాజనకమైన ఆవిష్కరణలు, పరిశోధన ఆలోచనలు, తరగతి గది ప్రాజెక్టులు, ప్రయోగశాల నమూనాలను గుర్తించి, వాటికి మార్గదర్శకత్వం వహించాలని విజ్జప్తి చేశారు.

ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 6.0 ఎంపికైన ప్రతి ఆలోచనను ఒక ఫంక్షనల్ ప్రోటోటైప్ గా, ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా లేదా వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తిగా అభివృద్ధి చేయడానికి 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఎంఎస్ఎంఈలు, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే ఆచరణాత్మక, విస్తరించదగిన, సాంకేతిక ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వివరించారు. గీతం గతంలో సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 5.0 కింద నిధుల కోసం విశ్వవిద్యాలయం నుంచి రెండు ప్రతిపాదనలు ఎంపికయ్యాయని శ్రీవాస్తవ తెలిపారు. కాలిన గాయాలకు పోర్టబుల్ డ్యూయల్-మోడ్ చికిత్సా పరికరమైన ఫ్లెక్సీహీల్ ను అభివృద్ధి చేసినందుకు డాక్టర్ సత్యబ్రత డాష్ కు 10.2 లక్షల రూపాయల ప్రభుత్వ మద్దతు లభించగా, తీరప్రాంత విపత్తుల పర్యవేక్షణ, సుస్థిర మత్స్య పరిశ్రమ కోసం ఏఐ ఆధారిత స్మార్ట్ బాయ్ నెట్ వర్క్ అయిన కోస్ట్-సేఫ్ కోసం చంద్రకాంత మహంతి 11.9 లక్షల రూపాయలు సాధించారన్నారు.

ప్రస్తుత ఎడిషన్లో గీతం మరింత గొప్ప విజయాన్ని సాధించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వినూత్న ఆలోచనలు ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఇంక్యుబేషన్, మెంటరింగ్ మద్దతుతో తమ భావనలను నిధులు పొందే ప్రాజెక్టులుగా మార్చుకోవాలని ఆయన ప్రోత్సహించారు. ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 6.0 కోసం జూలై 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని, ఎంఎస్ఎంఈ ఇన్నోవేషన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని, తమ ప్రతిపాదనలను సమర్పించేటప్పుడు గీతంను హోస్ట్ ఇన్ స్టిట్యూట్ గా ఎంచుకోవాలని సూచించారు.

ఈ హ్యాకథాన్ పునరుత్పాదక శక్తి, శక్తి సామర్థ్యం, ఆటోమోటివ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ 4.0, 5.0, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇంకా ఇతర అత్యాధునిక సాంకేతికతల వంటి రంగాలలో ఆలోచనలను ఆహ్వానిస్తుందన్నారు. ప్రతిపాదిత ఆవిష్కరణలు నూతనంగా, విస్తరించదగినవిగా, సామాజికంగా సంబంధితమైనవిగా ఉండాలని, వాణిజ్య సామర్థ్యంతో పనిచేసే నమూనాలుగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని స్పష్టీకరించారు. హ్యాకథాన్ గత సంచికలో సాధించిన అద్భుతమైన పనితీరును కొనసాగిస్తూనే, భారతదేశ ఆవిష్కరణ, వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థకు గీతం తన సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా, అర్హులైన విద్యార్థులను, పరిశోధన బృందాలు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించవలసిందిగా అధ్యాపకులను శ్రీవాస్తవ కోరారు.