కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ
తంగళ్ళపల్లి,జూలై 2(విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్టును టీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా సీనియర్ మహిళా నాయకురాలు చెరుకుపల్లి శైలజ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. భూపోరాటం సందర్భంగా కవితను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని, ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె బండరాళ్లపై పడటంతో గాయాలయ్యాయని శైలజ పేర్కొన్నారు.
అనంతరం పోలీసు వాహనం వద్దకు తీసుకెళ్లే సమయంలో కూడా ఆమెకు గాయాలయ్యాయని ఆరోపించారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరఫున పోరాడే నాయకులను ఈ విధంగా వ్యవహరించడం బాధాకరమని శైలజ అన్నారు. ఉద్యమాలను అణచివేయడం ద్వారా ప్రజల స్వరాన్ని అడ్డుకోలేరని, ప్రజా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులపై అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఇందుకు తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని చెరుకుపల్లి శైలజ పేర్కొన్నారు.






