శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి
- మత పెద్దలతో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ మీటింగ్లో
- కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ
పాల్వంచ, మే 18, (విజయక్రాంతి): శాంతియుత వాతావరణంలో పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ అన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ అండ్ ఎం ఫంక్షన్ హాలు నందు పట్టణంలోని మతపెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు.
పండుగ ఏ మతానిది అయిన సామరస్యత చాలా మంచి సంబంధాలను పెంపొందిస్తుందన్నారు.రాబోయే బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా మత పెద్దలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని,ఎవరైనా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే వెంటనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో కొత్తగూడెం పట్టణంలోని అన్ని మతాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పీస్ కమిటీ సమావేశంలో కొత్తగూడెం 2టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్, 3టౌన్ సీఐ ఇంద్రాసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






