7 July, 2026 | 3:52 AM

కుమారుడిని హత్య చేసిన తండ్రి

07-07-2026 12:56 AM

ఇల్లు అమ్మేందుకు హత్య చేసినట్లు తెలిపిన పోలీసులు 

కల్లూరు,జూలై 6(విజయ క్రాంతి): ఇల్లు అమ్ముకునేందుకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతో సొంత కుమారుడినే హత్య చేసిన ఘటన కల్లూరు పట్టణంలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన కొత్తపల్లి సీతారాములు (తండ్రి: రాములు /రాయప్ప) చెడు వ్యసనాలకు బానిసై పలు నేరాలకు పాల్పడుతూ ఇప్పటికే పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు.

ఇటీవల తన అవసరాల కోసం కుటుంబంతో నివసిస్తున్న ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించగా, భార్యతో పాటు కుమారుడు కిరణ్ కుమార్ దీనికి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో కుమారుడిపై ద్వేషం పెంచుకున్న సీతారాములు,అతడిని హత్య చేయాలని పన్నాగం పన్నాడు.ఈ నెల 3వ తేదీ సాయంత్రం కుమారుడిని కల్లూరులోని ఓ బెల్ట్ షాప్కు తీసుకెళ్లి మద్యం తాగించిన అనంతరం ఇంటికి తీసుకొచ్చాడు.

మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై బలంగా దాడి చేయడంతో కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.ఘటన అనంతరం నిందితుడు ఆటోలో పరారై,ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు,విస్సన్నపేట ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు.సమాచారం మేరకు పోలీసులు గాలింపు చేపట్టి,సోమవారం ముగ్గు వెంకటాపురం గ్రామం వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నేరాన్ని ఒప్పుకున్న నిందితుడి వద్ద నుంచి ఆటోతో పాటు హత్యకు ఉపయోగించిన రోకలి బండ,కత్తిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని రిమాండ్ నిమిత్తం సత్తుపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.