8 May, 2026 | 7:49 AM

రైతులు సౌర విద్యుత్ యంత్రాలను వినియోగించుకోవాలి

08-05-2026 12:00 AM

రెడ్ కో సీఎండీ అనిలా వావిళ్ల

ఆమనగల్లు, మే 7 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా రైతులు సౌర విద్యుత్ (సోలార్) సబ్సిడీ యంత్ర పరికరాలను అందిపుచ్చుకోవాలని తెలంగాణ రెడ్ కో సీఎండీ అనిలా వావిళ్ల పిలుపునిచ్చారు.

ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమనగల్లు రైతు వేదికలో ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం కుసుమ్ పథకం ద్వారా లభించే సౌర విద్యుత్ కేంద్రాల సబ్సిడీ వివరాలను రైతులకు వివరించారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాల ప్రదర్శనను ప్రజా ప్రతినిధులు, రైతులు ఆసక్తిగా సందర్శించారు.

ఏడీఏ శోభ రాణి వ్యవసాయ యాంత్రీకరణ ప్రాముఖ్యతను వివరించగా, రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.  వ్యవసాయంలో విద్యుత్ ఖర్చును తగ్గించుకుంటూ, సౌర శక్తి ద్వారా లాభదాయకమైన సాగును ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు. ఈ సమావేశంలో టీజీఎస్ పీడీసీఎల్ డీఈ గోపాలకృష్ణ, ఏడీఈ బాలకృష్ణ, వ్యవసాయ అధికారులు (ఏవోలు) శ్రీనివాస్ గౌడ్, అరుణకుమారి, కవిత, రేణుకా చక్రవర్తిని, ట్రాన్స్కో ఏఈలు, పలువురు సర్పంచ్లు మరియు నాలుగు మండలాల రైతులు పాల్గొన్నారు.