రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం తరలింపులో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తోటపల్లి పరిధిలోని శ్రీలక్ష్మి రైస్ మిల్లో ఉన్న 25 వేల క్వింటాళ్ల నిల్వ సామర్థ్యం గల గోదాంను ధాన్యం నిల్వ కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. కొత్త గోదాం ద్వారా ధాన్యం నిల్వ ప్రక్రియ వేగవంతమై కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ మాట్లాడుతూ, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందన్నారు. గోదాం సదుపాయాన్ని బెజ్జంకి మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






