ముదురుతున్న రుతుపవనాల సంక్షోభం
దేశంలో 40 శాతం తగ్గిన వర్షపాతం
జూన్ 21 తర్వాతే పుంజుకునే అవకాశం
ఉందన్న వాతావరణ శాఖ
న్యూఢిల్లీ, జూన్ 17 (విజయక్రాంతి): దేశంలో నైరుతి రుతుపవనాల గమనం ఆందోళనకరంగా మారింది. వాటి పురోగతి పూర్తిగా నిలిచిపోయింది. ఇన్శాట్-3డీఎస్ శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వర్షపాత లోటు 40 శాతానికి చేరుకుంది.
జూన్ 4 నుంచి జూన్ 17 వరకు దేశంలో సాధారణంగా 65.9 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. ప్రస్తుతానికి కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ పరిస్థితి దేశంలోని ప్రధాన వ్యవసాయ మండలాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశంలోని పలు ప్రధాన రాష్ట్రాలు తీవ్ర వర్షపాత కొరతను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా జూన్ నెలలో విత్తనాలు నాటే ప్రక్రియ వేగవంతం అవుతుంది. వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణంలో చోటు చేసుకున్న ప్రతికూల మార్పులే ఈ మందగమనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురిపించే మేఘాలన్నీ కేవలం బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలు, హిందూ మహాసముద్ర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కాగా జూన్ నెలలో కురిసే వర్షా లు వరి, సోయాబీన్, పత్తి, పప్పు ధాన్యాల సాగుకు ఎంతో కీలకం. వర్షాలు మరింత ఆలస్యమైతే విత్తనాలు నాటే షెడ్యూల్ మారి పోతుంది. వాతావరణ నమూనాల ప్రకారం జూన్ 21 తర్వాత సముద్రం నుంచి తేమ గాలులు బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాతే రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అప్పటివరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు.






