విద్యావ్యవస్థను మెరుగుపరచాలి
27-08-2026 07:28 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో విద్యావ్యవస్థను మెరుగుపరచి, విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గురుకులాలకు సొంత భవనాలు, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయాలని, జనకాపూర్ బీసీ బాలికల వసతి గృహాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆసిఫాబాద్ మోడల్ పాఠశాల వద్ద విద్యార్థుల భద్రత కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్, కోశాధికారి దుర్గం నిఖిల్ పాల్గొన్నారు.






