18 May, 2026 | 8:58 AM

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే

18-05-2026 12:00 AM

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 54 మంది

జవహర్‌నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శివశంకర్

దమ్మాయిగూడ, మే 17 (విజయక్రాంతి): మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష, పదివేల జరిమానా తప్పదని జవహర్‌నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. జవహర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సర్కిల్ ఎస్‌ఐ శివశంకర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 54 మంది డ్రైవర్లు పట్టు పడ్డారని తెలిపారు.

మద్యం మత్తులో వాహనాన్ని నడపవద్దని, విలువైన జీవితాలను కోల్పోవద్దని, కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో 70శాతం మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే జరుగుతున్నాయని మద్యం మత్తులో నడిపేవారే అత్యధికంగా చనిపోతున్నారని తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి ఇతర వ్యక్తుల మరణానికి కారణమైతే వారు శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్  ఏసీపీ రామలింగరాజు మల్కాజిగిరి ట్రాఫిక్ సీఐ నరసింహ, గోపాలపురం ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.