చంద్రపురి డివిజన్లో ‘సర్’పై ఇంటింటి ప్రచారం
జవహర్నగర్, జులై 6 (విజయక్రాంతి): మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమంపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సి ఆర్ పి ఎఫ్ అరుంధతి నగర్ బూత్ నంబర్లు 598, 599, 600, 601తో పాటు మల్కారం బూత్ నంబర్ 594 పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు సర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక ప్రజలను కలిసి ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను పరిశీలించుకుని, అవసరమైతే మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు అమూల్యమైనదని, స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో సర్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కర్ల పూడి జోగారావు సంతోష్ గుప్తా, మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు, సీనియర్ నాయకులు ఓం ప్రకాష్, అశోక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి, మల్లికార్జున్ గౌడ్, రామ్ చారి, మహేష్ గౌడ్, శీనన్న తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం సర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరు తన బాధ్యతను నిర్వర్తించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.






