24 June, 2026 | 10:58 AM

తడిసిన ధాన్యం పేరుతో రైతులకు అన్యాయం చేయొద్దు

24-06-2026 09:45 AM

తెలంగాణ ఆదర్శ రైతు రాష్ట్ర అధ్యక్షుడు కసిరబోయిన లింగయ్యయాదవ్ 

తుంగతుర్తి,(విజయక్రాంతి): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం, మిల్లర్లు అండగా నిలవాల్సిన సమయంలో తడిసిన ధాన్యం పేరుతో భారీ కోతలు విధించడం అన్యాయమని తెలంగాణ ఆదర్శ రైతు రాష్ట్ర అధ్యక్షుడు కసిరబోయిన లింగయ్యయాదవ్  అన్నారు.తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన రైతు కసిరబోయిన కిష్టయ్య ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 129 బస్తాల ధాన్యాన్ని కాంటా వేయించగా, నేరేడుచర్లలోని శివ బాలాజీ రైస్ మిల్లులో ధాన్యం తడిసిందనే కారణంతో 50 బస్తాలకు కోత విధిస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని చెప్పడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవడం రైతుల తప్పు కాదని, ఇప్పటికే పంట నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై అదనపు భారం మోపడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.దీనిపై రాష్ట్ర  వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి  ఫిర్యాదు  చేసినట్లు తెలిపారు రైతు కిష్టయ్య ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని, తడిసిన ధాన్యం పేరుతో రైతులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కసిరబోయిన లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. రైతుల కష్టార్జిత పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జిల్లా ఉన్నత అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రైతుకు జరిగిన సంఘటన పై అవసరమైతే, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోనున్నట్లు తెలిపారు.