సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం
* విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ – విద్యాభ్యాసానికి శ్రీకారం
అశ్వాపురం,(విజయక్రాంతి): వేసవి సెలవులు ముగియడంతో అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. మొదటి రోజే విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు చేరుకుని తమ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణాలు సందడిగా మారాయి. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.
పుస్తకాలను అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త ఉత్సాహంతో విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు విద్యా సామగ్రి వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. పాఠశాల పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయపాలన, నిత్య హాజరు వంటి అంశాలపై సూచనలు అందించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు.
మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇదే తరహా వాతావరణం నెలకొంది. విద్యార్థుల హాజరు కూడా ఆశాజనకంగా ఉండటంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.






