8 May, 2026 | 6:46 AM

భక్త జనసంద్రం మల్లన్న క్షేత్రం

09-02-2026 12:31 AM

నాలుగో ఆదివారం పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, ఫిబ్రవరి 8: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా నాలుగో ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం నుంచే భక్తుల రాక మొదలు కాగా ఆదివారం తెల్లవారుజాము వరకు మల్లన్న సన్నిధానికి చేరుకున్నారు.

భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ను దర్శించుకోవడానికి బారులు తీరారు. పట్నాలు వేసి, బోనాలు చెల్లించి, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారిని వేడుకున్నారు. గుట్టపైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎత్తుకొని బయలుదేరి వెళ్లి అమ్మవారికి నివేదించి, ఓడిబియాలు సమర్పించారు. భక్తితో వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది.