అంబులెన్స్లో ప్రసవం తల్లి, బిడ్డ సురక్షితం
20-03-2026 12:00 AM
దమ్మపేట, మార్చి 19,(విజయక్రాంతి): దమ్మపేట మండలం, గండుగులపల్లి గ్రామానికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనలతో బాధపడుతుండగా 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దమ్మపేట 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఎంటి చీమల రాము పరీక్షించగా ఆమెకు తీవ్ర ప్రసవ వేదనలు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆమెను అంబులెన్స్లోకి తీసుకుని వైద్య పరీక్షలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా కృష్ణకుమారి ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్లోనే సురక్షితంగా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండగా, అనంతరం సమీప దమ్మపేట ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో చాకచక్యంగా స్పందించిన ఈ ఎం టీ చీమల రాము, పైలట్ లాల్సింగ్ను స్థానికులు అభినందించారు.




