08-02-2026 12:23:43 PM
- అడవిలో ఉండాల్సిన జింక పట్టణ నడిబొడ్డులో దర్శనం ఇవ్వడం పట్ల అనుమానాలు.
- అటవీ అధికారుల నిర్లక్ష్యం వైద్యం అందించకుండానే అడవిలోకి.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అటవీ ప్రాంతంలో ఉండాల్సిన జింక నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున అర్ధరాత్రి దర్శనం ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతుంది. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు వెంబడించడంతో మాంగల్య షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలోకి పరుగులు పెడుతూ వెళ్ళింది. ఇది గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కుక్క కాటుకు రక్త గాయాలు, తీవ్ర ఆందోళన కరంగా ఉన్న ఆ జింకకు పశువైద్యాధికారుల సహాయంతో వైద్యం అందించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఎవరూ వైద్యులు అందుబాటులో లేరని ఆరోపిస్తూ బుద్ధారం అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టినట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై పశువైద్యాధికారి జ్ఞాన శేఖర్ ను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కుక్కకాటు ప్రమాదకరమైందని పేర్కొన్నారు.
అటవీ ప్రాంతానికి సుమారు 30 కిలోమీటర్ల పైగా దూరంగా ఉన్న నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున జింక దర్శనం ఇవ్వడం పట్ల అటవీశాఖ అధికారుల తీరు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుల చేత అక్రమంగా రవాణా జరుగుతున్న క్రమంలో జింక తప్పించుకొని బయటపడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే వన్య ప్రాణుల సంరక్షణ పరిస్థితి ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.