మహిళలను మోసం చేయడం కాంగ్రెస్కు రివాజు: ఏపీ సీఎం చంద్రబాబు
మహిళలను మోసం చేయడమనేది కాంగ్రెస్కు మొదటి నుంచి అలవాటేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా కోటా బిల్లుపై కాంగ్రెస్ 30 ఏళ్లుగా మోసం చేస్తూ వస్తున్నదని ధ్వజమెత్తారు. విపక్షాలు మహిళా కోటా బిల్లును వీగిపోయేలా చేయడం వల్ల, మహిళా రిజర్వేషన్ల అమలు 2034కి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండియా కూటమి సహకరిస్తే, బిల్లు సునాయాసంగా ఆమోదం పొందేదని తెలిపారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు చెబుతున్నాయని, వారి వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపడేశారు. 2029 నుంచైనా చట్టసభలో తమకు ౩౩శాతం రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఆశపడ్డారని, వారి ఆశలపై ఇండియా కూటమి నీళ్లు చల్లిందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరమని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.






