బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు
లెక్కలు తప్పయితే రాజీనామాకు సిద్దం
అందుకు కేటీఆర్ సిద్దమా..?
మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని, కేటీఆర్ ప్రజలను మభ్య పెట్టడం ఇకనైనా మానుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, తాను చెప్పిన లెక్కలు అబద్ధాలని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రాజేష్ రెడ్డిలతో కలిసి మంత్రి జూపల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వస్తానని, తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే స్పీకర్ కు రాజీనామా లేఖ ఇస్తా, చర్చకు సిద్ధమా..? అని కేటీఆర్ కు సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ గొప్ప పాలన చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు గద్దె దింపారు.. ? గతంలో వారి ఆస్తులు ఎట్లా ఉండే.. ? ఇప్పుడు వారి ఆస్తులు ఎట్లా ఉన్నాయో అందరికీ తెలుసని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టారు, తెలంగాణ సొమ్ముతో జల్సాలు చేశారని, తమరు చేసిన తప్పులకు మిమ్మల్ని గద్దె దించిన ప్రజలని తప్పు పడతారా.. ? అని మంత్రి జూపల్లి ఆగ్రహాం వ్యక్తం చేశారు. గారడీ మాటలతో ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తే ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఒకసారి రూ. 20,157 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని, మీరు రుణమాఫీకి నాలుగేండ్ల సమయం తీసుకున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బుల కోసం ఔటర్ రింగ్ రోడ్డును లీజుకి ఇచ్చిన ఘనత మీదని, కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
కూట్లో రాయి ఎత్తలేనోడు ఏట్లో రాయి ఎత్తుతానన్నట్లుగా బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ పవిత్రకు, కేసీఆర్ పాలనకు పొంతన లేదని, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగలేదని జూపల్లి కృష్ణారావు ఫైర్ అన్నారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, తెలంగాణ సొమ్మును కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని, అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే హరీశ్ రావు ఎందుకు సమాధానం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు.
ఎయిర్పోర్ట్, రింగు రోడ్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్స్ సిటీ, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ స్థాపన ఇవన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినవే కదా? అన్నారు. ప్రగతి భవన్, సచివాలయం నిర్మించి, సీఎం క్యాంపు కార్యాలయాన్ని రూ. 200 కోట్ల ఖర్చు చేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. ఆధారరహిత మాటలు మాట్లాడడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.






