calender_icon.png 14 February, 2026 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యలపై సిపిఐ నిరంతర పోరాటం: తీర్పారి వెంకటేశ్వర్లు

14-02-2026 09:28:42 PM

మునుగోడు,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ కార్యకర్తలు నిరంతరం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తీర్పారి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం మునుగోడులో నిర్వహించిన సిపిఐ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ, కార్మిక రంగాలను సంక్షోభంలోకి నెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల పేరుతో రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వరి ధాన్యం, పత్తి పంటలను మార్కెట్లో విక్రయించలేని పరిస్థితి తీసుకొస్తోందని విమర్శించారు.

ఎరువుల సబ్సిడీలు తగ్గించి రైతులపై భారాన్ని మోపిందన్నారు.ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థ కారణంగా పత్తి రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, యూరియా కొనుగోలుకు రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ విధానం మాయ మార్కెట్‌గా మారిందని విమర్శించారు. రైతులు, పేద ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం పార్టీ తరఫున నిరంతరం పోరాడాలని కోరారు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.బి.లాలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, మండల కార్యవర్గ సభ్యులు సర్పంచ్ బండమీది యాదయ్య, దుబ్బ వెంకన్న, మందుల పాండు, మునుగోటి దయాకర్, మాధగోని సత్తమ్మ  ఉన్నారు.