21-02-2026 03:11:30 PM
కాగజ్నగర్(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలని కోరుతూ రైతులు, బిఆర్ ఎస్ నాయకులు శనివారం కాగజ్నగర్ తహసిల్దార్ మధుకర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల అనేక గ్రామాల్లో ఇప్పటికీ పత్తి కోత పూర్తికాలేదని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కొనుగోలు గడువు ముగిసితే తమ పంటను మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం కోల్పోతామని, దాంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోలు కేంద్రాల గడువును మరికొన్ని రోజులు లేదా వారాల పాటు పొడిగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఎమ్మార్వోను కోరారు. కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం సమర్పించినట్లు నాయకులు తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, అవసరమైతే ఉద్యమాలకు సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, రైతులు పాల్గొన్నారు.