20 May, 2026 | 3:35 PM

కలుషిత నీరు.. సమస్యను పరిష్కరించాలి

20-05-2026 12:00 AM

జీఎంను కలిసిన మాజీ కార్పొరేటర్ పావని

ముషీరాబాద్, మే 19 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్‌లోని పలుబస్తీలు, కాలనీలలో గత రెండు నెలలుగా పూర్తిగా రంగు మారిన, కలుషిత మంచినీటి సరఫరాతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని జలమండలి జీఎం శ్రీధర్ రెడ్డిని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్  కోరారు. మంగళవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌తో కలిసి జలమండలి కార్యాలయంలో జీఎం  శ్రీధర్ రెడ్డిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు.

మంచినీటి సరఫరాలో ప్రెషర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు పచ్చటి రంగుతో పూర్తిగా మురికి నీరు సరఫరా కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. డివిజన్‌లోని అరుంధతి నగర్ బస్తీ, సబర్మతి నగర్, వివి గిరి నగర్, అన్నా నగర్, వాల్మీకి నగర్‌తో పాటు మరిన్ని ప్రాంతాల్లో నీరు సరఫరా అవుతుందన్నారు.

వెంటనే సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, కలుషిత నీటి సరఫరాతో పాటు మంచినీటి లోథూ సమస్యను కూడా పరిష్కరించాలని, లేకుంటే డివిజన్ ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్పందించిన జీఎం  తక్షణ చర్యల్లో భాగంగా సమస్యను పరిష్కరించేందు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని మాజీ కార్పొరేటర్  తెలిపారు.