హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన
మంథని,ఆగస్టు 21(విజయక్రాంతి): హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) పాల్గొన్న ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుదుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రు రాజమల్లు తదితరులు మాట్లాడుతూ.. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిని అవమానించే విధంగా జరిగిన ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, గౌరవం కల్పించే రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వివక్షాపూరిత చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని నాయకులు అన్నారు. ప్రతి కులం, ప్రతి మతానికి చెందిన వారిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు నాయకత్వంలో మంథని నియోజకవర్గంలో సామాజిక సమానత్వం, సోదరభావంతో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతున్నామని నాయకులు తెలిపారు. కుల, మత విద్వేషాలకు తావులేకుండా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






