పని చేసే ప్రభుత్వం కాంగ్రెస్...
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ధర్మపురి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాగితాలకు పరిమితమైన ప్రభుత్వమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష్మీనరసింహ సదన్ ను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 5 కోట్ల అంచనాలతో ప్రారంభించిన లక్ష్మీనరసింహ సదన్ నిర్మాణానికి గత ప్రభుత్వం కేవలం కోటి రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మి నరసింహ సదన్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చొరవతో నిధులు విడుదల చేయించినట్లు మంత్రి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే శ్రీ లక్ష్మీనరసింహ సదన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి 2.24కోట్లు విడుదల చేయించినట్లు మంత్రి తెలిపారు.
కొత్తగా నిర్మించిన గదుల్లో ఫర్నిచర్ కోరకు రూపాయలు కోటి వరకు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆరు వీఐపీ గదులతో పాటు సామాన్య భక్తుల కోసం 60 గదులు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు మంత్రి వివరించారు. దేవాదాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు వారంలో ఒకసారి సదన్ ను సందర్శించి పరిసరాల పరిశుభ్రత మౌలిక సదుపాయాల మెరుగుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేముల రాజేష్ తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ధర్మపురి మున్సిపల్ అధికారులు, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.






