05-02-2026 04:42:21 PM
బ్యాలెట్ పేపర్ల ముద్రణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి:
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, బ్యాలెట్ పేపర్ల ముద్రణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఆదర్శనగర్ లో గల విజయ్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ లో, మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియను, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైనన్ని బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
బ్యాలెట్ పేపర్ల ముద్రణలో ఎటువంటి లోపాలు తలెత్తకూడదని పేర్కొన్నారు. అనధికార వ్యక్తులను ఎవరిని ముద్రణ కేంద్రంలోకి అనుమతించకూడదని చెప్పారు. ముద్రణ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేంతవరకు పటిష్ట పోలీసు బందోబస్తు కొనసాగించాలని వివరించారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ విధులు కేటాయించిన సిబ్బంది, ముద్రణ తీరును మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, జెడ్పీ సీఈవో శంకర్, ఉద్యానవన పంటల అధికారి రమణ, తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.