04-02-2026 04:22:29 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రతి సామాజిక వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమారంలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం(ధర్మసాగర్)లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. బాలికలు ఆర్థికాభివృద్ధిని సాధించాలని అన్నారు.
ఆర్థిక స్వాతంత్ర్యం సాధించిన తర్వాతనే బాలికలు వివాహం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులతో సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, హసన్ పర్తి తహసిల్దార్ కిరణ్ కుమార్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ సంపూర్ణ, వసతి గృహ వార్డెన్ ప్రియాంక, అధ్యాపకులు, కళాశాల వసతిగృహం విద్యార్థినులు పాల్గొన్నారు.