స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, (విజయక్రాంతి): ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం, జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15న జరుపుకొనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ భావం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణలో భాగంగా కలెక్టరేట్ లో చేపట్టనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల తరపున స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని, ప్రముఖులకు, పుర ప్రముఖులకు, అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేయాలన్నారు.
జిల్లా ప్రగతిపై రూపొందించే సందేశం కాపీలను సీపీఓ, డీపీఆర్ఓ సంయుక్తంగా కలిసి తయారు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను విద్యా శాఖ అధికారులు చేపట్టాలన్నారు. అలాగే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా చేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలతో చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అగ్నిమాపక యంత్రాలను సిద్దంగా ఉంచాలని, తాగునీరు, స్నాక్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని, స్టేజ్ అలంకరణ, పూలమొక్కల ఏర్పాటు, తివాచీలను, బ్యారికేడ్ లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీసు బందోబస్తు, గౌరవ వందనం, పోలీసు బ్యాండ్ వంటి ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.






