సీఎంఆర్ సకాలంలో పూర్తి చేయాలి
సూర్యాపేట, మార్చి 11 (విజయక్రాంతి) : 2025 -26 రబీ సీజన్ కు సంబందించి రైస్ మిల్లర్ లు సీఎంఆర్ ను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లలతో సీఎంఆర్ చెల్లింపులపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అందుకు అనుగుణంగా మిల్లర్లు తమ రైస్ మిల్లులలో, అవసరమైతే బయట ప్రదేశాలలో కూడా వరి ధాన్యం నిల్వ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే ఈ సీజన్ కు అవసరమైన ప్యాడి బస్తాలను (గన్నీలు) మిల్లర్లు రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రబీ 2024-25, ఖరీఫ్ 2025- 26 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను సకాలంలో పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని మిల్లర్లను కోరారు.
జిల్లాలోని అన్ని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు సీఎంఆర్ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అదేవిధంగా జిల్లాలో సుమారు 335 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే దించుకొని సంబందిత ట్రక్ షీట్లు వెంటనే సమర్పించాలని మిల్లర్లకు సూచించారు. అలాగే జిల్లాలో గత సీజన్ కు సంబందించిన సీఎంఆర్ డెలివరీలు కొంతమేర పెండింగ్ లో ఉన్నందున వాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
రాబోయే సీజన్ కు ముందు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్, అవసరమైన ధాన్యం పరిమాణాన్ని లేఖ రూపంలో సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయించబడుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు , జిల్లా మేనేజర్ రాము, సివిల్ సప్లై శాఖ సిబ్బంది మరియు జిల్లాలోని సుమారు 40 మంది రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.




