రాజకీయాలు వద్దు.. అభివృద్ధి గురించే మాట్లాడదాం
హైదరాబాద్: హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తెలంగాణలో రూ.9,377 కోట్లతో చేపట్టనున్న వర్చువల్ గా పలు అభివృద్ధి పనులకు గచ్చిబౌలిలోని హెచ్ఐసీ సెంటర్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభోత్సం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇదే కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ఇది తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లేందుకు అవసరమైన అభివృద్ధి ఉత్సవం అని పేర్కొన్నారు. ప్రధాని ప్రణాళిక అయిన వికసిత్ భారత్ తో కలిసి నడుస్తామని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయి పోయాయని సీఎం గుర్తు చేశారు.
ఇప్పడు రాజకీయాలు మాట్లాడాల్సిన పనిలేదని, అభివృద్ధి గురించే మాట్లాడదామని చెప్పారు. దేశ జనాభాలో తెలంగాణ 3 శాతం వాటా కలిగి ఉందని, దేశ జీడీపీకి తెలంగాణ 5 శాతం వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 30 ట్రిలియన్ డాలర్లలో తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల వాటా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని, 2034 నాటికి తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని, దేశాభివృద్ధిలో ఆరు మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న ఆరు నగరాలను కేంద్రం ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి డిమాండ్ కోరారు.






