సీఎం రేవంత్ రెడ్డితో గోద్రెజ్ ప్రతినిధులు భేటీ
హైదరాబాద్: గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పావిలియన్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు) రాకేష్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి రాకేష్ స్వామి నివేదిక అందజేశారు. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపైన చర్చించారు.
ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటువుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సీరీ, ఆర్ అండ్ డి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంస్థ కోరినట్లు సమాచారం. ప్రాసెసింగ్ మిల్ కోసం రాహదారిని విస్తరించాలని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరాడంతో టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని ఆదేశించారు.






