30 June, 2026 | 7:20 PM

వెల్ఫేర్ బోర్డు స్కీమ్ లను ఇన్సూరెన్స్ సంస్థలకు ఇవ్వొద్దంటూ సీఐటీయూ ధర్నా

30-06-2026 06:02 PM

సీఎస్సీ హెల్త్ టెస్టుల దందా ఆపాలి:మల్లూరు చంద్రశేఖర్(బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు)

నాయబ్ తహశీల్దార్ లక్ష్మణ్ కు వినతి

వేంసూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో భవన, ఇతర నిర్మాణ కార్మికులు 2009 వరకు పోరాడి వెల్ఫేర్ బోర్డును సాధించుకున్న విషయం పాఠకులకు విదితమే.ఆ బోర్డు నుండి కార్మికులకు అందించే సంక్షేమ పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకు ఇవ్వొద్దంటూ సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గంటపాటు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ ధర్నా నిర్వహించారు.నాయబ్ తహశీల్దార్ లక్ష్మణ్ కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆయన స్పందించి ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు.

ముందుగా స్థానిక ఎర్రారామయ్య భవనం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు.అనంతరం జరిగిన నిరసన సభలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బోర్డు అడ్వైజరీ కమిటి ను రద్దు చేసి  తనకు ఇష్టం వచ్చినట్లు బోర్డు లో ఉన్న కార్మికుల సొమ్మును దుబారా చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు కార్మికుల సంక్షేమాన్ని అప్పగిస్తూ కార్మికులకు బీమా అనే పేరుతో అదనపు సొమ్మును ట్రైల్ బ్లేజర్  సంస్థకు ప్రీమియం పేరుతో దోచి పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే బోర్డు అడ్వైజరీ కమిటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అంతే కాకుండా సి.ఎస్.సి. అనే సంస్థకు హెల్త్  టెస్టుల పేరుతో దందా చేస్తూ కోట్ల రూపాయల సొమ్మును కట్టబెడుతూ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఖజానా ఖాళీ చేస్తుందన్నారు.

అట్టి లీజును రద్దు చేయాలని కోరారు. టెస్టులతో కార్మికులకు ఒరిగిందేమీ లేదని నేరుగా బోర్డు నుండి కార్మికులకు వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న క్లైమ్ లు పరిష్కారం చేయాలని ట్రైల్ బ్లేజర్ సంస్థ వద్ద మూలుగుతున్న మరణాల సహాయాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ లో వస్తున్న సర్వర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. సాధారణ మరణం చెందినప్పుడు నామిని కు ఇచ్చే రెండు లక్షల రూపాయల సహాయాన్ని 05 లక్షలకు పెంచాలని, ప్రసూతి, వివాహా కానుకలను 30 వేల నుండి లక్ష రూపాయలకు పెంచాలని, లేబర్ ఆఫీస్ లలో బ్రోకర్స్ వ్యవస్థను అరికట్టాలని, 55 ఏళ్ళు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6 వేలు చొప్పున బోర్డు నుండి పింఛను ఇవ్వాలని, పిల్లల చదువులకు స్కాలర్ షిప్పు లు ఇవ్వాలని, కార్మికుని స్వంత గృహ నిర్మాణానికి బోర్డ్ నుండి ఐదు లక్షలు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.